భాగవతం

నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖా దమృత ద్రవసమ్మితమ్ ।
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాః ॥


అది సరస్వతీ నదీతీరం. వ్యాసముని చంద్రుని పవిత్ర ఆశ్రమం. అక్కడ జైమిని, పైల, సుమంత, వైశంపాయనాది శిష్యులు ధర్మశాస్త్ర మీమాంస చేస్తున్నారు. లోకోవృత్త సమీక్ష చేస్తున్నారు. సృష్టి, స్థితి లయాత్మకమయిన ఈ జగత్తు యొక్క లీలా విశేషాలు, పదార్థ పరమార్థతత్త్వ వివేచనాలు వారి గోష్ఠిలో సాగిపోతున్నాయి.

వారికి అక్షర భిక్ష పెట్టిన గురుదేవులు ఆచార్య వ్యాసులు మాత్రం అన్యమనస్కంగా ఉన్నారు. ప్రతిరోజు వారి చర్చలలో, వాగ్వాదాలలో పాల్గొని వారి బుద్ధికి అందని తాత్విక రహస్యాలు వివరించే ఆ మహర్షి యీనాడు చింతాక్రాంతులై ఉండడం ఆశ్చర్య వ్యధ కలిగించింది.

అయినా ఆయన ఏకాంత మౌన మహా సమాధిని భంగ పరచడం యిష్టం లేక శిష్యులు తమ చర్చలో నిమగ్నులయ్యారు.

అంతలో అక్కడకు దేవ ఋషి నారదుడు వచ్చాడు. వైశంపాయనాదులు ఆయనకు అర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఉచితాసనంపై కూర్చోబెట్టారు.

భక్తి వేదాంత రసాలు

పరమ విష్ణు భక్తుడయిన నారదుడు అక్షర తపస్వి కృష్ణద్వైపాయనుడు ఎదురెదురుగా ఉన్నారు. క్షణంసేపు యిరువురిలో మహామౌనం తాండవించింది. ఒకరి నేత్రాలలో జిజ్ఞాస, అవి నారదుని చూపులు, మరొకరి కందోయిలో అసంతృప్తి చేతన. అది వ్యాసుని దృష్టి ప్రసారం. నారదుడే వ్యాసుని విచారానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు:
"దేవర్షీ! సరస్వతీ కటాక్షం చేత రాశీభూతంగా ఉన్న వేదసముచ్ఛయాన్ని విభాగించి నాలుగు వేదాలుగా లోకానికి అందించగలిగాను. విజ్ఞాన సర్వస్వమయిన మహా భారతాన్ని రచించి తపస్వులకు నివేదనం చేశాను. శ్రీరామతత్వాన్ని విశ్లేషించి అధ్యాత్మ రామాయణాన్ని వేదాంతులకు జ్ఞానామృతంగా పంచాను. ఈ మహాసృష్టి కాలస్వరూపాన్ని వివరించే పద్దెనిమిది పురాణాలు వెలయించాను. ఇంక వాఙ్ఞ్మయం సృష్టించినా నాలో తృప్తి కలగలేదు. నాకు శాంతి లభించలేదు. నా సాహిత్య పిపాస తీరలేదు. ఏం చేస్తే నా అక్షర తపో సాధన సార్థకం అవుతుంది?"
వ్యాసుని మాటలు విన్న నారద మహర్షి మందహాసం చేసి యిలా అన్నాడు.
"కృష్ణద్వైపాయనా! శ్రుతివిహితమయిన రీతిలో సంచరించే ప్రాఙ్ఞులకు మాత్రమే వేదం అంది వస్తుంది. అసాధారణ ధీమంతులు మాత్రమే మహాభారతాన్ని ధారణ చేయగలరు. వేదాంత మనస్కులు మాత్రమే అధ్యాత్మ రామయణామృతాన్ని గ్రోలెదరు. ఇక పురాణాలంతావా అవి అక్షయ విషయ సంభవితాలు. కనుక సామాన్యులు వాటిలో ప్రవేశించలేరు. అంతమాత్రం చేత నీ అక్షర తపస్సు వృధా పోయినదని అర్థం కాదు. ఆ చంద్రతార్కారం. అది సాహితీ పథగాములకు ప్రాతః స్మరణీయాలే అవుతాయి. కానీ సామాన్య జనులు సులభంగా తరించడానికి ఙ్ఞాన వేదాంత భావాల్ని అవగతం చేసికొనడానికి ఉపయుక్తమైన మహా భాగవతాన్ని వ్రాయి. అది భక్తి వేదాంత రసాలమై అందరికీ ఉపకరిస్తుంది. నీకు చిత్తశాంతి లభిస్తుంది."